నగ్నసత్యాలు: మెగా బ్రదర్స్ పై మీడియా ఎందుకు విషం కక్కుతుంది?
కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవాలుగా
భావిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి అన్నా…
తెలుగు మీడియా ఎందుకు విషం కక్కుతోంది? రేటింగ్స్ పెంచుకోవడానకీ, పత్రికల
సర్క్యులేషన్లు పెంచుకోవడానికి మెగా ఫ్యామిలీ ఇంటర్వ్యూల కోసం వెంపర్లాడే
తెలుగు మీడియా మెగా ఫ్యామిలీ అన్నా, ముఖ్యంగా ఈ ఇద్దరు సెలబ్రిటీలన్నా
ఎందుకు మీడియా యజమానులకు కోపం… ఎందుకంత ద్వేషం? 40 సంవత్సరాలు తెలుగు
మీడియాలో ‘ఈనాడు’ దినపత్రిక నుంచి ‘ఆంధ్రభూమి’ దిన పత్రిక వరకూ పని చేసిన
ఒక జర్నలిస్టు చెప్పిన నగ్న సత్యాలివి…. మెయిన్ స్ట్రీమ్ మీడియా
చెప్పదలచుకోని ఆ నగ్నసత్యాలు మీ కోసం…!!
‘‘ప్రజల సొమ్మును దోచుకున్న ఒక దుర్మార్గుడిని నేను లఫూట్ అని తిట్టినందుకు… నాపై టీవీ ఛానెళ్లలో చర్చలు పెట్టారు. ఎవరో అనామకులు నా తల్లిని తిడితే దాన్ని ప్రముఖంగా ఛానెళ్లలో చూపించారు (ఇది మీడియా నైతిక సూత్రాలకు విరుద్ధం). అదే బాలకృష్ణ ప్రధాన మంత్రిని తిట్టినా వారు చర్చలు పెట్టలేదు. మీడియా వాళ్లకు ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వారు కనిపించరా?’’
ఇదీ పవన్ తరచూ తన పోరాట యాత్ర సభల్లో ప్రజల
ముందు చేస్తూ వస్తున్న విమర్శ.
విషయంలోకి వెళ్లే ముందు కాస్త మీడియా చరిత్ర
తెలుసుకుంటే అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. ఓపికగా చదవండి:
ఒకప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి
దినపత్రికలు మనుగడలో ఉన్నపుడు జర్నలిజం నాలుగు పాదాలా (ధర్మంలాగ) నడిచేది.
అప్పటికి వార్తలను యథాతథంగా ఇవ్వడం, వాటిపైన సీనియర్ పాత్రికేయులు
వ్యాఖ్యానం చేయడం ఆనవాయితీగా ఉండేది. దొంగబుద్ధులు పెద్దగా లేనికాలం.
ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చేరవేయాలన్న తపన ఉన్నకాలం.
డొక్కశుద్ధి లేకపోయినా
జర్నలిస్టులకు లక్షల రూపాయల జీతాలు ఇస్తున్న ఈ రోజులకూ, అప్పటి రోజులకూ
పోలికే లేదు. జర్నలిజం మూలాలు స్వాతంత్ర్య ఉద్యమం నాటివి. సమాజం అభివృద్ధి
కోరుకునే అంకితభావం ఉన్న వారే జర్నలిజంలోకి అడుగుపెట్టేవారు.
ఉద్ధండులైన
జర్నలిస్టులు సైతం చాలీ చాలని జీతాలకు పని చేసేవారు. ఉప్పు పట్టిన చెమట
చొక్కాలతో కనిపించేవారు. 1974లో ఈనాడు ప్రారంభమైన తర్వాత నుంచీ పరిస్థితి
పూర్తిగా మారిపోయింది. క్రమేపీ జర్నలిజం వ్యాపార రూపం సంతరించుకున్నది.
యజమానులూ, వారితోపాటు జర్నలిస్టులూ మారిపోయారు.
యజమానిని గెట్ లాస్ట్ అన్న సంపాదకుడు
నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెసు పార్టీది.
దాని యజమాని- ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి సొంత పత్రికా కార్యాలయానికి
వెళ్లారు. హెరాల్డ్ ఎడిటర్ గా ఉన్న కోటంరాజు రామారావుగారు (తెలుగు వారు)
నెహ్రూను ఉద్దేశించి ‘‘ఇక్కడ యజమానులకు ఏం పని? మీరు ముందు బయటకు నడవండి’’
అన్నారు. గెట్ లాస్ట్ అని కటువుగా చెప్పారట. ప్రముఖ పాత్రికేయుడు పతంజలి
ఈనాడు దినపత్రికలో పని చేస్తున్నపుడు తిరుపతి ఎడిషన్ మేనేజరు వచ్చి ‘‘ఏం
పతంజలి గారూ.. వార్తలు ఏమిటి?’’ అని అడిగాడట.. నొచ్చుకున్న పతంజలిగారు
‘‘మీరు అక్కడ కుండలో మంచినీళ్లు ఉన్నాయో లేదో చూసుకోండి. అది మీ పని.
వార్తలు నా పని. మీరు ఇక వెళ్లవచ్చు’’ అని అన్నారట. అదీ సంపాదకుడు అంటే!
మేం ఉద్యోగాల్లో చేరినపుడు సీనియర్లు ఇవన్నీ
చెబుతుంటే జర్నలిజం ఎంత గొప్ప వృత్తో కదా అనుకుంటూ పొంగిపోని రోజు ఉండేది
కాదు. ఇపుడు ఓనమాలు కూడా తెలియని మేనేజర్లు ‘ఈనాడు’లో పని చేస్తున్న
జర్నలిస్టులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది ఈనాటి పరిస్థితి.
ఎన్టీరామారావు రాజకీయాల్లో వచ్చిన తర్వాత డబ్బు, భూములు బాగా
సంపాదించుకున్న కమ్మ సామాజిక వర్గం నయా పెట్టుబడిదారులుగా అవతరించారు.
రామోజీ ఫిల్మ్ సిటీ భూముల విషయంలో తగాదా అయినపుడు ప్రభుత్వం ఈనాడుకు
వత్తాసు పలకడంతో… వ్యాపారవేత్త గిరీష్ సంఘీకి కోపం వచ్చి వార్త దినపత్రికను
ప్రారంభించారు. కానీ… రామోజీరావుకు ఉన్న వ్యాపార దక్షత (ఓటమిని
అంగీకరించలేని మనస్తత్వం) ఆయనకు లేకపోవడంతో వార్త దినపత్రిక నష్టాల్లో
కూరుకుపోయింది.
ఒకప్పుడు ఈనాడు దినపత్రికను సవాలు చేసిన ఏకైక దినపత్రిక
‘ఉదయం’. అయితే… సంస్థాగత నష్టాలతో (ఉదయం యాజమాన్యం-దాసరి నారాయణరావుది.
ఆయనది నామ్ కేవాస్తే కాపు సామాజిక వర్గం. చుట్టూ ఉన్న మేనేజర్ల వ్యవస్థ
కమ్మ సామాజిక వర్గమే. దాసరి శ్రీమతి పద్మ కమ్మ సామాజిక వర్గం) తెరమరుగైంది.
తర్వాత ‘ఉదయం’ పత్రికను ఒంగోలు మద్యం వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి
కొని కొన్నాళ్లు నడిపించారు. కానీ ఉదయం అంటే ‘ఈనాడు’ యాజమాన్యానికి ఒక
రకమైన భయం ఉండేది. ఆ రోజుల్లో ఉదయం సంచలనాత్మక కథనాలతో ఆకట్టుకునేది. మోహన్
వంటి కార్టూనిస్టులతో పత్రిక అద్భుతంగా వచ్చేది. అది విప్లవాత్మక భావాలకు
పుట్టిల్లు.
శత్రువును ప్రత్యక్షంగా కొట్టడం తెలివిలేని వాళ్లు చేసే పని.
నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ సారా ఉద్యమం చేసింది కదా. అప్పటికి అది
జిల్లా ఎడిషన్ వార్త. కానీ ‘ఈనాడు’ దానిని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా
మలిచింది. ప్రధాన దినపత్రిక ద్వారా సారా ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
ఫలితంగా మద్య నిషేధం అనివార్యం కావడంతో… మాగుంట వ్యాపారం ఢమాల్ కావడం,
తత్ఫలితంగా ‘ఉదయం’ శాశ్వతంగా సమాధి అయిపోవడం జరిగిపోయింది. ‘ఈనాడు’
చాణక్యనీతిని ప్రదర్శించింది.
చక్కటి సామాజిక స్పృహ ఉన్న దినపత్రికగా
‘ఈనాడు’ అవతరించింది. తెర వెనుక శత్రునాశనం జరిగింది. పోటీదారులను
దుంపనాశనం చేయడం వ్యాపారంలో భాగం. ఎన్టీరామారావు లక్ష్మీ పార్వతిని పెళ్లి
చేసుకున్న తర్వాత, ఆమె రాజ్యాంగేతర శక్తిగా మారడం కమ్మ సామాజిక వర్గం
పెద్దలకు నచ్చలేదు. ఒక పెద్ద సామాజిక వర్గానికి అండగా ఉన్న రాజకీయ పార్టీ
ఓ సాధారణ మహిళ చేతికి వెళ్లిపోవడం పెద్దలను కలవరపాటుకు గురిచేసింది. ఆమెను
దెయ్యం అన్నారు… రాక్షసి అన్నారు… హరికృష్ణను కూడా అందుకు
ఉపయోగించుకున్నారు.
రాజకీయ ఫలాలను ఆస్వాదిస్తూ కొత్త తరం
పారిశ్రామికవేత్తలుగా కమ్మ సామాజిక వర్గం మరింత ఎత్తులకు ఎదుగుతున్న దశ
అది. ఏ మాత్రం రిస్కు తీసుకోకుండా… పెద్దలు చంద్రబాబును రంగంలోకి దించారు.
ఇది ఎన్టీరామారావుపై ప్రేమలేక చేసింది కాదు. వ్యక్తి కన్నా వ్యవస్థ
ముఖ్యమని రామోజీరావు నమ్ముతారు. దాన్నే అమలు చేశారు.
రామారావు అంతటి మేరు
పర్వతాన్ని వెన్నుపోటు పొడిచి పనికిరాని వ్యక్తిగా, వృద్ధాప్యంలో వనితా
వ్యామోహంగా ముద్రవేసి … ప్రజల ముందు బలహీనుడిని చేశారు. అంత మనిషినే
కాదనుకున్న వారికి మెగాస్టార్ ఎంత? సీను మారిపోయింది. ఆంధ్రజ్యోతి
రాధాకృష్ణ, ఇనగంటి వెంకట్రావు ఇత్యాది సీనియర్ పాత్రికేయులందరూ రామారావును
బలహీన పరిచే ప్రాజెక్టులో తలో చేయి వేశారు. సాయం చేసిన వారి రుణం చంద్రబాబు
ఉంచుకోలేదు. జర్నలిస్టు రాధాకృష్ణ పవర్ ప్లాంటు యజమాని అయ్యారు. తర్వాత
ఆంద్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ టీవీలు ఆయన కిరీటంలో చేరి అదో పెద్ద మీడియా
సామ్రాజ్యంగా అవతరించింది.
అనతికాలంలోనే… ఈ ‘ఆపరేషన్ ఎన్టఆర్’లో
పాల్గొన్న జర్నలిస్టులు కోటీశ్వరులుగా నేడు మనకళ్ల ముందే ఉన్నారు. రూ.200
ఉద్యోగంలో చేరిన వారు నేడు పత్రికాధిపతులు అయ్యారు. కమ్మ సామాజిక వర్గం
వారు ప్రతి చిన్న దానికీ రామోజీరావు దగ్గరకు వెళ్లలేని స్థితి ఇప్పటికీ
ఉంది. అలాంటి వారందరికీ రాధాకృష్ణ ఆలంబన అయ్యారు. 1983 తర్వాత రాజకీయ
అధికారం చుట్టూ తిరిగిన క్రోనీ క్యాపిటలిస్టులు ఇబ్బడిముబ్బడిగా తెలుగుదేశం
హయంలో సంపాదించుకున్నారు. ఇపుడు వారు కూడా ఇష్టం వచ్చినట్లు టీవీ
చానెళ్లు, దినపత్రికలూ పెట్టేశారు. దీంతో… మీడియా సామ్రాజ్యం పూర్తిగా కమ్మ
సామాజిక వర్గం చేతిలోకి వెళ్లిపోయింది. ‘పత్రికా స్వేచ్ఛ’ అంటే ఏమిటో ఈ
మీడియా సామ్రాజ్యం నిర్ణయిస్తుంది. మరెవరికీ అవకాశమే లేదు. తెరవెనుక
సహజంగానే వారంతా తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి సాగిపోతున్నారు. వాణిజ్య
ప్రకటనల ఒత్తిడి కావచ్చు… సొంత సామాజిక వర్గం అవసరాలు కావచ్చు.. పడుగు
పేకల్లా కమ్మ సామాజిక వర్గం… మీడియా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు
చేసుకోగలిగింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత
అవుటర్ రింగు రోడ్డు వ్యవహారంలో ‘‘పెద్దలా గద్దలా’’ అంటూ ఈనాడు మొదటి పేజీ
నిండా పెద్ద స్టోరీని ప్రచురించింది. వైఎస్ అరికాలి మంట నెత్తికి
వచ్చింది. తాను రెడ్డి సామాజిక వర్గం అయినందునే ఈనాడు కక్ష కట్టిందని
భావించి తానూ ఒక టీవీ ఛానెల్, దినపత్రిక (సాక్షి)లను పెట్టి, ఒక భారీ
మీడియా సంస్థనే నిర్మించారు.
మాటల యుద్ధం జరిగింది. రామోజీరావును నగ్నంగా
ఉన్నట్లు సాక్షి కార్టూను వేసింది. ఏది నిజం శీర్షికతో రామోజీ ఆస్తులపై
పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించింది. పెద్ద పత్రికా యుద్ధమే నడిచింది.
సాక్షి కూడా పెద్ద మీడియా సామ్రాజ్యం కనుక, గణనీయమైన పాఠకులు దానికీ
ఉన్నందున, ఈనాడు-సాక్షి యుద్ధం ముగిసి.. ఇరుపక్షాలూ శాంతిని
పాటిస్తున్నాయి.
సాక్షి ఛైర్మన్ భారతీ, మార్గదర్శ ఎండీ శైలజా ఇద్దరూ
మాట్లాడుకుని రాజీ పడినట్లు చెబుతారు. (అప్పటి వరకూ రెడ్డి సామాజిక వర్గం
చేతిలో ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ ఉన్నా ఎందుకో అవి రెడ్డి సామాజిక
వర్గం ఆకాంక్షలకు దన్నుగా నిలవలేదు). సాక్షి మాత్రమే ఇపుడు రెడ్డి సామాజిక
వర్గానికి మీడియా దన్నును అందిస్తోంది.
1947 నుంచి 1983 వరకూ రెడ్లు మాత్రమే (ఒకటి
రెండు మినహాయింపులతో) ముఖ్యమంత్రులుగా పని చేశారు. తర్వాత కమ్మ
సామాజికవర్గం చేతుల్లోకి అధికారం వచ్చింది. ఫ్యాక్షనిస్టులు, రాజకీయ వైరి
వర్గాలు… ఒకరు కాంగ్రెసు ఉంటే, మరొకరు తెలుగుదేశంలో చేరేవాళ్లు. రెండూ…
భిన్న ధృవాలుగా ఉండేవి. పోరాటం కూడా నేటికీ ఈ రెండు వర్గాల మధ్యనే.
మిగిలిన
కాపులూ, బీసీలూ, ఎస్సీలూ, ముస్లింలు ఓట్లర్లుగా మిగిలిపోయారు. ఈ
పత్రికల్లో, టీవీల్లో ఈ రెండు వర్గాలకు చెందిన సవాళ్లు, ప్రతి సవాళ్ల
గురించి చర్చించుకోవడంలోనే బీసీలూ, ఇతర బడుగు వర్గాలు మునిగిపోయాయి. వీళ్లు
రాజ్యాధికారం గురించి నొరెత్తరు. ప్రధానమైన ఈ రెండు వర్గాల్లో ఎవరున్నా…
పడేసిన చిన్న చిన్న పదవులతో సంతృప్తిపడేవారు. సీఎం కుర్చీ అన్నది ఈ బడుగు
వర్గాలు కలలో కూడా ఊహించనిది.
సామాజిక న్యాయం పేరుతో… మెగాస్టార్ 2009లో
తెరపైకి దూసుకు వచ్చారు. మళ్లీ కమ్మ సామాజిక వర్గంలో ప్రకంపనలు మొదలయ్యాయి.
ఎప్పటి నుంచో సీఎం కుర్చీని రెడ్డీ, లేదా కమ్మలు రిజర్వు చేసుకున్నారు.
మరి కాపులు వస్తానంటే…? ఏ బీసీ కృష్ణయ్య అడిగితే పెద్ద పట్టించుకోరు.
అడిగింది మెగాస్టార్.
ఒక కుట్ర ప్రకారం.. మెగాస్టార్ తో ఒకవైపు పైకి
నవ్వుతూనే వెన్నుపోటు పొడిచారు. పిచ్చికుక్క అని ముద్రవేస్తే ప్రజలే
రాళ్లేసి చంపుతారని వారికి తెలుసు. మీడియా మొత్తం కమ్మ సామాజిక వర్గం
కనుసన్నల్లో నడుస్తున్న విషయాన్ని అప్పటికీ, ఇప్పటికీ అంతగా ఎవరూ
గుర్తించలేదు. (ఇపుడు సోషల్ మీడియాలో బడుగు వర్గాలు బాహాటంగానే
తిట్టిపోస్తున్నారు).
సీఎం కుర్చీలో అయితే వాళ్లు (రెడ్లు), లేదా మేము
(కమ్మ) ఉండాలిగానీ… మధ్యలో ఈ కాపుల గోల ఏమిటి అన్నది కమ్మ సామాజిక వర్గం
బాధ. మెగాస్టార్ ఒక ప్రభంజనంగా దూసుకొచ్చారు. తిరుపతి సభ ఒక సమ్మోహనం.
అంతే.. తెరవెనుక రహస్య ప్రణాళిక సిద్ధం అయింది. పాత్రధారులూ సిద్ధం. పరకాల
ప్రభాకర్, ఈనాడు విలేకరి కన్నబాబు, కేసినేని నాని ఇలా అందరూ వచ్చి
ప్రజారాజ్యంలో చేరిపోయారు. ఈ విషయాన్ని చిరంజీవిగానీ, పార్టీ ముఖ్యులుగానీ
పసిగట్టలేదు. ఆయన స్థానంలో ఎవరున్నా ఇలాగే జరిగేది. పక్కనున్న వాళ్లే ఎదురు
తిరగడం, ప్రజారాజ్యాన్ని పుట్టి ముంచేయడం లిప్తపాటులో జరిగిపోయింది. అవును
ప్రజారాజ్యం డబ్బులు తీసుకుంది అంటూ మీడియా దుమ్మెత్తిపోసింది.
మీడియా
పరంగా చిరంజీవికి జరిగినంత అన్యాయం తెలుగు రాష్ట్రాల్లో మరెవరికీ జరిగి
ఉండదన్నది నిజం. (తెలంగాణ ఉద్యమ సమయలో కూడా ఈ తరహా ప్రయత్నం జరగకపోలేదు.
కానీ ‘ఈనాడు’ పత్రికలను తెరాస వాళ్లు తగలబెట్టడం, రామోజీ ఫిల్మ్ సిటీని
నాగలితో దున్నేస్తానని కేసీఆర్ హెచ్చరించడంతో మీడియా మొగల్స్ రాజీ పడ్డారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన అద్దాల భవంతులపై తెరాస రాళ్లు విసరడంతో
వలలు కట్టుకున్నారు. కుయుక్తులకు స్వస్తి పలికి మద్దతు ప్రకటించాల్సి
వచ్చింది).
కాపులు రాజ్యాధికారంలోకి రాకూడదు అన్నది ఆయా
వర్గాల బలమైన ఆలోచనగా ఉంది. ఏం జరిగిందన్నది పవన్ పసిగట్టకపోలేదు. అందుకే
బాహాటంగానే కన్నబాబునీ, పరకాలనూ తిట్టిపోశారు. అన్నయ్య ఎన్నో ఆశయాలతో
వచ్చారని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ రూపంలో కమ్మ సామాజిక వర్గానికి,
రెడ్డి సామాజిక వర్గానికీ ఇపుడు మరో ప్రమాదం వచ్చి పడింది.
ఒకసారి
తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి… పవన్ ఇపుడు ఎదురు తిరిగాడు
కాబట్టి… ఆయన్ను జీరో చేయడం అంత సులభమేమీ కాదు. ఇది వారికి స్పష్టంగా
తెలుసు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మీదు మిక్కిలి పవన్ గొంతు
పెద్దది! ఏమైనా అంటే వీరపాండ్య కట్ట బ్రహ్మన్నలా విరుచుకుపడతారు.
చిరంజీవిలా ఈయన మెత్తని మనిషి కాదు. ఏ మాత్రం డిప్లొమసీ లేదు. చెంప
ఛెళ్లుమన్నట్లు ఉంటాయి మాటలు. శ్రీరెడ్డి విషయంలో ఏబీఎన్ ఛానెల్ పవన్ పై
చర్చ పెట్టినపుడు ట్విటర్ ద్వారానే ఏబీఎన్ అధినేత రాధాకృష్ణకు చుక్కలు
చూపించారు. ‘‘చెల్లెమ్మా… రాధాకృష్ణకు పొద్దున్నే ఇడ్లీతోపాటు కాస్త నీతిని
కూడా వడ్డించమ్మా’’ అంటూ మాటల్నే ఈటెలుగా చేసి వదిలారు పవన్.
2009లో
మాదిరిగా ఆపరేషన్ చేయడానికి పవన్ ఇపుడు ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు.
మేథావులతో పని లేదు బాబూ… నా పని నేను చేసుకుంటాను అన్నట్లు ఉంది ఇపుడు
పవన్ ఆలోచన.
అందుకే… యల్లో మీడియా రంగంలోకి దిగింది.
అందులో భాగంగా పవన్ ను కొత్తగా వచ్చే ఛానెళ్లలో ఇంద్రుడూ, చంద్రుడూ అని
ఆకాశానికి ఎత్తుతారు. ఏపీ 24X7 ఛానెల్ అదే పని చేసింది. పొగిడిన నోటితోనే…
ఆత్మహననం జరిగిపోవాలి. జగన్ పై దాడి జరిగినపుడు ఏపి 24X7 ఛానెల్ జర్నలిస్టు అడిగిన తొలి ప్రశ్న…
‘‘దాడి చేసింది జనసేన కార్యకర్త అంటున్నారు నిజమేనా?’’ అని…
జర్నలిస్టులను
నడిపించేవారు, ఆడించేవారు తెర వెనుక ఉంటారు. ‘‘అరే.. మొన్నటి వరకూ పవన్
కళ్యాణ్ చాలా గొప్పవాడనే అనుకున్నాను. అందుకే మేము ఆయన్ను సమర్ధించాం. ఒక్క
మాట కూడా నెగటివ్ గా మాట్లాడలేదు. కానీ ఇపుడు చూశారా… ఇపుడు ఏమైందో అంటూ
ఏదో ఒక విషయంలో అదే నోటితో ఆ ఆయన వ్యక్తిత్వాన్ని చంపేస్తారు. సినిమా
స్క్రిప్టు కూడా పక్బందీగా రాదు. ఎంత కుట్ర..( సరిగ్గా మూర్తి కూడా ఇలాగే
అన్నాడు కదా). దీన్నే ఆంగ్లంలో ‘‘కోల్డ్ బ్లడెడ్ మర్డర్’’ అని చెబుతారు.
కొంత కాలం కత్తి మహేష్ అనే ఎస్సీ వ్యక్తిని తెచ్చి ఛానళ్లలో పవన్ ని
తిట్టించారు. కత్తి మహేష్ మాట్లాడిన ప్రతిసారీ రూ.50 వేలు ఎందుకు ఇచ్చి
ఉంటారు మరి. ఇది కుట్ర అన్నది కత్తి మహేష్ కి కూడా తెలియదు. పవన్
అభిమానులకు పవన్ అంటే దేవుడు. ఒక్క మాట ఆయన్ను అంటే పవన్ అభిమానులు
రెచ్చిపోతారని తెలుసు. తెలిసే ఇదంతా చేస్తారు. పవన్ అభిమానులు బూతులు
తిడుతున్నారని మళ్లీ వార్తలు రాస్తారు. ప్రసారం చేస్తారు.
వ్యూహాత్మకంగానే
శ్రీ రెడ్డిని దించారు. పవన్ కళ్యాణ్ ను తిట్టించారు. ‘‘తిట్టమని నేనే
చెప్పాను’’ అంటూ రామ్ గోపాల్ వర్మ (లగడపాటి రాజగోపాల్ సన్నిహితుడు,
దర్శకుడు) బహిరంగంగానే చెప్పారు. కమ్మ సామాజిక వర్గం వారు ఏ పార్టీలో
ఉన్నా… అందరూ కలసికట్టుగా పని చేస్తారు. సమతా పార్టీ ఇక్కడ లేకపోయినా…
దానిని ఇక్కడ ప్రారంభించి కేంద్రంలో జార్జి ఫెర్నాండెజ్ నుంచి కొన్ని పనులు
చేయించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ ను జీరో చేయడానికి గోబెల్స్
ప్రచారానికి తెరతీస్తారు. ‘2009లో ఏడవలేకపోయారుగానీ… ఇపుడేం పీకుతారు’ అని
ప్రచారం చేయిస్తారు. డిబేట్లలో చెప్పిస్తారు. యాంకరు తన నోటితో చెప్పదు.
ఛానెల్ అభిప్రాయాన్ని గెస్టుల నోటి ద్వారా చెప్పిస్తారు. ఛానెల్ అడిగితే
కాదు అనేది ఎవరు? అదే టీవీల్లో వస్తుంది. అదే పత్రికల్లోనూ వస్తుంది.
ప్రజల్లో కూడా అదే చర్చ నడుస్తుంది. కొందరు కాపులు కూడా ఇదే మాట వల్లె
వేస్తారు. ఎందుకంటే చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి పార్టీని నాశనం చేశారని
వాళ్లు కూడా నమ్మేలా చేశారు.
టీవీ ఛానెల్ ప్రభావం ఎంత ఉంటుందంటే రాత్రిని
పగలనీ, పగటిని రాత్రి అనీ చెప్పగల సామర్ధ్యం ఉన్న ప్రసార మాథ్యమం అది.
కత్తిలాంటిది. మంచి వాళ్ల చేతిలో సుదర్శనాస్త్రం అయితే, స్వార్థపరుల చేతిలో
ఉంటే సమాజ వినాశనం.
చిరంజీవి వాళ్లు డబ్బులు తీసుకుని పార్టీని
ముంచేశారని, అల్లు అరవింద్ ఇదంతా చేశాడని ప్రచారం చేశారు. ‘మంచి’ గుమ్మం
దాటేలోపు ‘చెడు’ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. కానీ.. డబ్బులు తీసుకోని
పార్టీ ఏది? మీడియా ద్వారా కమ్మ సామాజిక వర్గం తెర వెనుక ఉండి చేయించిన
మాయా మశ్చీంద్ర. ప్రజారాజ్యం వెనుక ఇంత కుట్ర జరిగిందని ఇప్పటి వరకూ కాపు
సామాజిక వర్గానికే తెలియదు. ఎక్కడ చెప్పాలి? ఎవరు రాస్తారు? వేదిక ఎక్కడ?
2009లో చిరంజీవి మీద బురద చల్లినట్లే… జనసేన
మీద కూడా బురద చల్లేందుకు మీడియా కాచుకుని ఉన్నది. ఐటీసీ కాకతీయ షెరటాన్ లో
పార్టీ చందాలను అధికారికంగా సేకరిస్తుంటే… మహాటీవీ స్టింగ్ ఆపరేషన్
చేసింది (కమ్మ సామాజిక వర్గానిదే). జర్నలిస్టు మూర్తి మాట్లాడుతూ…‘‘తాను
ప్రపంచంలోనే గొప్ప జర్నలిస్టును అన్నట్లు చెప్పుకున్నారు. తాను చేసిన
స్టింగ్ ఆపరేషన్లో నిజాయితీ ఉందని చెప్పడానికి తాను రెడ్డి, కమ్మ కులాలకు
చెందని వాడినని చెప్పారు. మూర్తి బ్రాహ్మణ సామాజిక వర్గం కాబట్టి..
కమ్మవారి కోసమో, రెడ్ల కోసమే పని చేయడం లేదని చెప్పగలరా? సాక్షిలో ఉన్న
జర్నలిస్టులకు కూడా తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తోందని ఒక జర్నలిస్టు
మిత్రుడు చెప్పగా విని… ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.
అప్పుడూ అంతే…!
చిరంజీవి చిన్న కూతురు విషయంలో గొడవ అయినపుడు
కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ టీవీ 9 పదే పదే అది చూపించింది. ఒకటి
చిరంజీవిని దెబ్బకొట్టడం. రెండోది రేటింగ్స్ పెంచుకోవడం. నష్టం జరిగేది
చిరంజీవికే కదా.. మీడియాకు రెండు విధాలా లాభం. కమ్మ సామాజిక వర్గం అయితే…
అది పెద్ద వార్త కాదన్నట్లు పట్టించుకోరు. కమ్మ సామాజిక వర్గంలో పని చేస్తూ
కమ్మవాళ్లకు వ్యతిరేకంగా ఎలా రాయగలుగుతారు జర్నలిస్టులు? అంత సాహసులు
ఉన్నారా? రాసినా అవి వెలుగు చూస్తాయా?
బాలకృష్ణ బూతులు తిడితే ఛానెళ్లలో చర్చలు పెట్టరేమిటి అని అడగడంలో అర్థం లేదు. ఎందుకు పెడతారండి బాబూ… ! కుటిల నీతి !!
అధికారంలో వాటా కోసం ప్రయత్నింస్తున్నందునే…!
అప్పుడు టార్గెట్ చిరంజీవి…ఇపుడు టార్గెట్
పవన్ కళ్యాణ్. ఒక్క విషయం ఆలోచించండి. ఒకటి రెండు సినిమాలు చేసిన చిన్న
నటుడు శివాజీని నెత్తికి ఎత్తుకున్నది తెలుగు దేశం పార్టీ. ఆయన్ను రాజకీయ
నాయకుడిగా చేసేందుకు ఒక ఛానెల్ శతధా ప్రయత్నిస్తోంది. ఒక వేళ మెగా ఫ్యామిలీ
కమ్మ సామాజిక వర్గం అయి ఉంటే … ఇవన్నీ జరుగుతాయా? ఒకసారి ఊహించండి…!!
వారిద్దరూ సినిమాలకి పరిమితం అయితే… ఎలాంటి
ఇబ్బందీ లేదు. వాళ్ల మీద పెట్టుబడి పెడతారు. అంతకు పది రెట్లు డబ్బులు
సంపాదించుకుంటారు. ఇపుడు రాజకీయాధికారంలో వాటా అడుగుతున్నారు… అదీ వాళ్ల
గుండెల్ని పిండేస్తున్న బాధ!
నాకు పత్రికలు లేవు, టీవీ ఛానెళ్లు లేవు…
మీరే నా పత్రికలూ, మీరే నా టీవీ ఛానెళ్లు అని బహిరంగంగానే పవన్
చెబుతున్నారు. అమెరికా పుణ్యమా అని అమెరికాలో ప్రారంభమైన సోషల్ మీడియా మన
దేశానికీ విస్తరించింది. మీడియా గుత్తాధిపత్యాన్ని సోషల్ మీడియా
దెబ్బతీసింది. అదే సోషల్ మీడియా నేడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలను, ఆయన
ఆలోచనలనూ తీసుకుపోయి ప్రజల అర చేతిలో పెడుతున్నది.
సోషల్ మీడియాలో పవన్
నేడు ఒక సంచలనం. కోట్లాది మంది ప్రజలు ఆయన్ను ఫాలో అవుతున్నారు. పార్టీ
పెట్టాం కదా అని మీడియాకి లొంగిపోతే… ఆయన పవన్ కళ్యాణ్ కానే కాదు. ఆయన
మనస్తత్వం అది. చంద్రబాబులా లొంగిపోయే వ్యక్తి తరతరాలు గుర్తుండిపోయే
నాయకుడు కాలేడు. ఒక పటేల్… ఒక నెహ్రూ.. ఒక నేతాజీ, ఒక అంబేద్కర్. కొంతమంది
వస్తారు.. వెళ్లిపోతారు. కానీ జనం గుండెల్లో ఉండేది నిప్పులాంటి నాయకులే.
డబ్బూ, అధికారం ఒకే ఒరలో…!
డబ్బూ, అధికారం రెండూ ఒక ఒరలోనే ఉన్నాయి.
ఇపుడు కమ్మ సామాజిక వర్గం ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఏకంగా దేశ ప్రధాని
నరేంద్ర మోడీని ఇంటికి పంపేయాలన్నంత వరకూ వెళ్లింది. అందుకు సిగ్గు విడిచి
కాంగ్రెసుతో కలిసిపోయేంత స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. ఎన్టీఆర్
పెట్టిన పార్టీ వేరు… నేడున్న పార్టీ వేరు. ముందు పార్టీ విధాతను
తొక్కిపారేశారు. ఇపుడు ఆయన ఆశయాలకు ఉప్పు పాతర వేశారు. అధికారం.. డబ్బు.. ఈ
రెండే చంద్రబాబుకు ముఖ్యం. మోడీ మీద యుద్ధం ప్రకటించారు. ఇది చిన్న
విషయమేమీ కాదు. అందుకు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు
చెబుతున్నారు. దేశం ప్రమాదంలో పడినపుడల్లా తాను వస్తానని చెబుతున్నారు.
తనను తాను మహావిష్ణువులా భావించుకుంటున్నారేమో తెలియదు. అయినా.. తెలుగు
మీడియా ఆయనకు బాకా అయిపోయింది.
రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో..?
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు వస్తున్న
ఆదరణ… ఆ పార్టీని గంగ వెర్రులు పెట్టిస్తున్నది. ప్రజాబలం లేకపోయినా…పార్టీ
బలహీనపడినా చంద్రబాబు ఒప్పుకోరు. ప్రజలు ఆదరించకపోయినా అధికారంలోకి
వచ్చేయాలి. రేపు చంద్రబాబు ప్రధాని అయినా, లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా
ఆశ్చర్యం లేదు. వాళ్లిద్దరూ రావద్దని మీరు అనుకున్నా సరే, గెలుపు అవకాశాలను
సృష్టించుకుంటారు. అందులో ప్రజలకేం సంబంధం ఉండదు. సమీకరణాలు…అందుకే ఇతర
పార్టీలతో కలిసిపోయి… ముది వయసులో యవ్వనం కోసం ఆరాటపడే వృద్ధనారిని గుర్తు
చేస్తోంది తెలుగుదేశం!
రేపు మోడీకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ
ఒక దగ్గర కూర్చోబెట్టి.. ప్రధాన మంత్రిని నేనే కాబట్టి రేపు మీకు స్పెషల్
స్టేటస్ ఇచ్చేస్తాను… ఇక్కడ లోకేష్ సీఎంగా ఉంటాడు అని చంద్రబాబు
ప్రకటిస్తే.. తెలుగు ఓటర్ల పరిస్థితి ఏమిటి? మిగిలిన రాజకీయ పార్టీల
పరిస్థితులు ఏమిటి? తెరాస ఓడిపోతే తెలంగాణ సీఎంను చంద్రబాబే నిర్ణయిస్తారు.
అందుకే… ఈ దిగజారుడు రాజకీయాలపైనే జనసేనాని గళమెత్తారు. యువతరాన్ని కదలి రమ్మంటూ కదం తొక్కుతున్నారు.
దొంగ అయితే… మీ దగ్గర డబ్బులు ఎత్తుకుపోతాడు.
రాజకీయ దొంగ అయితే… మీ ఓట్లు ఎత్తుకుపోతాడు. మీ భవిష్యత్తునూ
ఎత్తుకుపోతాడు. తస్మాత్ జాగ్రత్త!!

Comments
Post a Comment