పవన్ కళ్యాణ్: నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే రోడ్డుపై నిలబెడతా

తాను చేసుకున్న పెళ్లిళ్ల గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, తన జోలికి వస్తే వారిని రోడ్డుపైకి తెచ్చి నిలబెడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
‘‘జగన్పై కోడికత్తితో దాడి జరిగితే టీడీపీవారు ఆయన తల్లిపై అభాండాలు వేశారు. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. జగన్ తల్లిని నేను గౌరవించాను. కానీ ఆయన నా వివాహాలను అడ్డుపెట్టుకుని తిడుతున్నారు.
జగన్ జైలుకెళ్లడానికి నేనే కారణమా? రాష్ట్ర విభజనకు, అవినీతికి అన్నిటికీ నేనా కారణం.. ఏం పిచ్చిపిచ్చిగా ఉందా. నా జోలికి వస్తే నడిరోడ్డుపై నిలబెడతా జాగ్రత్త’’ అని పవన్ తేల్చిచెప్పారు. వైసీపీకి ఓటేయకుంటే ప్రజలనైనా తిడతారా అని నిలదీశారు.
‘‘ఎమ్మెల్యేలు అందరూ వెళ్లిపోయినా.. నాయకుడు ఒక్కడైనా ఒంటరి పోరాటం చేయాలి.. తన పార్టీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి వెళ్లిపోయారని జగన్ పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రశ్నించేదెవరు’’ అని పవన్ అంతకుముందు అనంతపురంలో అన్నారు.
‘‘ఎమ్మెల్యేలను అధికారపార్టీ వారు కొన్నారని పంతానికి పోయి అసెంబ్లీకి వెళ్లబోమంటే ఎలా? పంతాలు పట్టింపులకు పోవడానికి ఇదేమీ సినిమా కాదు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడం నీచమైన పని. గతంలో వైఎస్ అధికారంలో ఉన్నపుడూ అదేపని చేశారు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
Comments
Post a Comment