వంతాడ లాటిరైట్ మైన్స్!!...కుంభకోణం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… నవంబర్ 4 ఆదివారం వంతాడ గ్రామంలో ఉన్న లాటరైట్
గనులను పరిశీలించారు. లాటరైటు గనుల స్థితిగతులను వివరిస్తూ… ఆయన ఫేస్ బుక్
లైవ్ లో గనుల పరిస్థితిని చూపిస్తూ… ఒక జర్నలిస్టు పాత్రను పోషించారు.
గనులను చూడటానికి తాను వస్తున్నందున ఇక్కడ ఎవరూ కనిపించడం లేదని, వీటి
వెనుక ఎవరున్నదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, నేల తల్లి పరిస్థితి
ఎలా ఉన్నదీ చూడండి అంటూ ఆయన ఫేస్ బుక్ లైవ్ వలో వివరించారు.
వాతావరణాన్ని
బట్టి అనేక రకాల నేలలు ఉంటాయి. అందులో రకరకాల లవణాలు ఉంటాయి. ఒక్కో చోట
ఒక్కోలా. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో ఉన్న
లాటిరైట్ గనులను ముందున్న రాష్ట్ర ప్రభుత్వాలు లీజునకు ఇచ్చాయి.
డాక్టర్
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వంతాడ గనిలో 100 లారీలు
తిరిగేవనీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వచ్చి, ఇవన్నీ ఆపేద్దామని
చెప్పారనీ, ఆయన వచ్చిన తర్వాత 200 లారీలు తిరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ కు
పరిస్థితిని వివరించడానికి వచ్చిన ఒకరు చెప్పారు.
2010వ సంవత్సరంలో 10 ఎకరాల్లో ఉన్న ఈ గనులపై
జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో విచారణ కూడా జరిగింది. కేవలం ప్రభుత్వానికి
రూ.2 కోట్లు చెల్లించి, కాంట్రాక్టరు రూ.12 కోట్లు సంపాదిస్తున్నారని ఒక
అంచనా. కొన్ని రకాల లాటిరైటు నేలల్లో బాక్సైటు ఉంటుంది. కొన్ని చోట్ల ఇనుప
ఖనిజం కూడా ఉంటుంది. లాటిరైటు అనేది ఇనుప ఖనిజం ఉన్న ఎర్రటి రాళ్లున్న నేల.
ఇందులో అల్యూమినయం తయారీకి అవసరమైన (బాక్సైటు) కూడా ఉండొచ్చు. ఈ మెత్తని
మట్టిలో ఉండే ఖనిజం ఆధారంగా దీని విలువ ఉంటుంది.
భారతదేశం వంటి ఉష్ణ మండల
నేలల్లో ఎక్కువ ప్రాంతాల్లో లాటిరైటు నేలలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ
ఖనిజాలను ముందు గుర్తించి, టెండరు విధానంలో గనులను అప్పగించాలి. అయితే,
లంచగొండి ప్రభుత్వాల వల్ల ప్రజాధనం ఇలా రాజకీయ నేతలపాటు కావడంతోపాటు,
ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతున్నాయి.
వంతాడ గ్రామంలో ఉన్న లాటిరైటు గనులు 10
ఎకరాల్లో ఉండగా, ఈ భూములు ఎవరివి అన్న వివాదం కూడా ఉంది. అటవీశాఖవి అని
చెబుతారు. దాదాపు రూ.9 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అప్పట్లో కోర్టులో
కేసులు కూడా దాఖలయ్యాయి.
నిజానికి గిరిజన ప్రాంతాల్లో ఉన్న చాలా ఖనిజ
వనరులను కాంట్రాక్టర్లు తవ్వేసుకుపోతున్నారు. అడవికి రక్షణగా ఎవరుంటారో
తెలుసా? అటవీ అధికారుల కంటే పులులే అడవిని రక్షిస్తాయి. పులుల్ని అడవి
రక్షిస్తుంది. అయితే, ఆధునిక మానవుల డబ్బు కాంక్ష ముందు పులులూ, అడవులూ ఏవీ
పనికిరాకుండా పోతున్నాయి.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే
చాలా వరకూ సహజ వనరులు దోపిడీకి గురికాకుండా ఉన్నాయి. నక్సల్ భయంతో
కాంట్రాక్టర్లు అడువులను దోచుకోవడం ఆగింది. అయితే, ఇపుడు ప్రభుత్వాలు అడవీ
మార్గాల్లో కూడా రహదారులను అభివృద్ధి చేసి, కాంట్రాక్టర్లను పెట్టి,
ఖనిజాలను తవ్వుకుంటున్నారు.
ఒకప్పుడు… కార్పొరేటు కంపెనీలకు సాయం చేయడం
అంటే నేరం కింద లెక్క. ఇపుడు ఆర్థిక సరళీకరణలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు
వస్తాయని చెప్పి, కార్పొరేట్లకు ప్రభుత్వాలే దోచి పెడుతున్నాయి. ప్రత్యేక
ఆర్థిక మండళ్ల పేరుతో పండే పంట పొలాలను సైతం కార్పొరేట్లకు
కట్టబెడుతున్నాయి.
మరి జనసేన పవన్ కళ్యాణ్… ఆలోచనలు చాలా
చురుకుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల కనుసన్నల్లోనే
ప్రభుత్వాలు నడిచే పరిస్థితి. పర్యావరణానికి హాని కలగకుండా మైనింగ్
జరగాలని, అందుకు అవసరమైన పర్యావరణ హిత మైనింగ్ విధానాన్ని తీసుకొస్తామని
ఆయన చెబుతున్నారు.

Comments
Post a Comment