నిశ్శబ్దంగా దూసుకుపోతున్న జనసేన

 
 
  • అక్రమాలను ఏకిపారేస్తూ… సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ…
  • ఉరిమే ఉత్సాహంతో మార్పు వైపు ప్రయాణం
  • సేనానీ… నీ వెంటే అంటున్న జన సైనికులు
  • పవన్ వ్యూహాలు అర్థంకాక కుదేలవుతున్న ప్రత్యర్థి పార్టీలు
  • ఆ ఒక్క పిలుపు కోసం మాజీ కాంగ్రెసు నేతల తంటాలు
                ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఏమి చేయనున్నది? ఎవరెవరు జనసేన పార్టీలో చేరుతున్నారు? వస్తానన్న వారికి మరి జన సేనాని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా? జనసేన గురించి ఇలాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానాలు తెలియక ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. స్పష్టంగా మేము ఇలా చేస్తాము… చేస్తున్నాము అని చెప్పకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు.

          పవన్ కళ్యాణ్ వ్యూహాలేమిటన్నది ఆయనకు సమీపంలో ఉన్న వారికి కూడా తెలియదని సమాచారం. ఎప్పటికప్పుడు నాయకుడు చెప్పిన దాని ప్రకారం పని చేసుకుంటూ పోవడమే అన్న ఆలోచన వారికి ఉన్నది. సీనియర్ నేతలు మూకుమ్మడిగా వచ్చేయడం… ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయడం వల్ల గతంలో ఒక చేదు అనుభవం ప్రజారాజ్యం పార్టీలో ఒక ఉదాహరణగా ఉంది. అందువల్ల ఆయన యువతరం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు అర్థం అవుతున్నది. 

           నిజానికి- తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తు పెట్టుకున్న తర్వాత… కాంగ్రెసులో ఉన్న చాలా మంది నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెసు పార్టీకి ఆదరణ ఏమీ లేకపోయినా… ఏదో ఉన్నాంలే అంటే ఉన్నాము అన్నట్లుగా సాగిపోతున్నది. ఒక్కసారిగా తెలుగుదేశం వచ్చి చేరడంతో కాంగ్రెసు నాయకులకు కూడా ఒక బలమైన కారణం దొరికింది. దీంతో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్, సి.రామచంద్రయ్య వంటి నేతలు ఇప్పటికే కాంగ్రెసును వీడి బయటకు వచ్చేశారు. 

         అనేక మంది కాంగ్రెసు నేతలు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు. పార్టీ అధ్యక్షుడుకి సంకేతాలు పంపే పనిలో సీనియర్ నేతలు నిమగ్నమై ఉన్నారు. పవన్ రమ్మంటే… ఒక్క పరుగున చేరిపోవడానికి అనేక మంది సీనియర్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే పవన్ మాత్రం… ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఇది పార్టీకి మంచి చేసేదే.

            సిద్ధాంతపరమైన కట్టుబాటు లేకుండా… ఇలా వచ్చేయడం… స్వార్థంతో మరో పార్టీలోకి వెళ్లిపోవడం అన్నదే ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు చేస్తున్నది. దీనికి అడ్డుకట్ట వేసి… ఒకసారి పార్టీలోకి రావాలంటే… సిద్ధాంతపరమైన కట్టుబాటు ఎంత వరకూ అన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ తూకం వేస్తున్నారని సమాచారం. నాయకుడి గత చరిత్రను కూడా పవన్ తెలుసుకుని ఆ తర్వాతనే… గ్రీన్ సిగ్నల్ ఇస్తారని జనసేనను దగ్గర నుండీ పరిశీలిస్తున్న ఒక నాయకుడు తెలిపారు.

             ఆయన తన విమర్శలను పదునెక్కిస్తున్న కొద్దీ… రోజు రోజుకీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడుతూ వస్తున్నది. జాతీయ స్థాయిలో కూటమిని తయారు చేస్తూ… జాతీయ స్థాయి నేతలను కలవడం ద్వారా మేకపోతు గాంభీర్యాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనబరుస్తున్నారుగానీ… పవన్ కళ్యాణ్ చెప్పినట్లు లోపల డొల్ల అన్నది నిజం. కోడిగుడ్డును పగలగొట్టడానికి గుండ్రాయి ఎందుకు అని పవన్ సామెత రూపంలో చక్కగానే తెలుగుదేశం పరిస్థితిని చెప్పారు.

          కాంగ్రెసుకు మరో 14 ఏళ్లపాటు భవిష్యత్తు లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపును ఇచ్చిన తర్వాత కాంగ్రెసుకున్న 5, 6 శాతం ఓట్లు కూడా పోయేటట్లు ఉన్నాయి. నిజానికి ఈ కొద్దిపాటి శాతం వస్తే… పవన్ కళ్యాణ్ తో పనిలేదనే చంద్రబాబు వ్యూహం. సరిగ్గా… పవన్ కళ్యాణ్ అక్కడే స్ట్రయిక్ చేశారు…  ఆ ప్రభావం ఇప్పటికే కాంగ్రెసు నేతలపై పడింది. అందువల్లనే ఇప్పటి వరకూ కలుగుల్లో నిద్రపోతున్న నేతలంతా కదిలి బయటకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు బాగున్నాయి… అంటూ కొత్తగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

కొత్తదారి వేస్తున్న జన సేనాని!

                       రొడ్డకొట్టుడు రాజకీయాలకు జనసేన సరైన ప్రత్యామ్నాయం కావాలి అన్నది జనసేనాని లక్ష్యం. సరిగ్గా ఇపుడు అదే క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. తెలుగుదేశం, వైఎస్సార్సీపీలకు ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన అందరికీ కనిపిస్తోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ… జనసేన ఉద్ధృతం రూపం దాల్చుతున్నది. జనంలోకి దూసుకుపోతున్నది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో ఏం చేయారో అన్న అనుమానాలూ పటాపంచలు అవుతున్నాయి. 

              ఒకప్పుడు ఆయన అన్ని సీట్లలో పోటీ చేయరు అని అన్నారు… లేదు, కార్యకర్తలు లేరు అని కొన్నాళ్లు అన్నారు… సినిమా గ్లామర్ అని కొన్నాళ్లు అన్నారు… ధవళ్వేశ్వరం భారీ కవాతు తర్వాత ఇతర పార్టీల గుండెల్లో భయం మొదలైంది. విజయవాడ నుంచి తుని వరకూ రైల్లో ప్రయాణిస్తూ… జన సేనాని చేసిన ప్రయత్నం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పెరుగెట్టాయి.ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో జర్నలిస్టుగా మారిపోయి లాటిరైటు గనుల అక్రమాలను స్వయంగా వెలుగులోని తెచ్చారు పవన్ కళ్యాణ్. అవినీతితో అంట కాగుతున్న తెలుగుదేశం నేతలకు ఈ ‘వంతాడ’ కుంభకోణం బహిర్గతం కావడంతో బహుశా వారు నిద్రలేని రాత్రులను గడుపుతుండవచ్చు.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్