జగన్ ప్రజాస్వామ్య చర్చలకు వ్యతిరేకమా??

ఒక రాజకీయ వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు, ఎదుటి పార్టీలతో
విభేదిస్తున్నప్పుడు కేవలం బహిరంగ సభల్లోనే కాదు ముఖా మూఖి చర్చల్లో,
సమావేశాల్లో కూడా దూకుడుగా పాల్గొనాలి. ఇతరులతో ఎందుకు విభేదిస్తున్నామో
కారణాలు చెప్పడం, లేవనెత్తిన సమస్యలకు పరిష్కారాలు చూపడం, రాష్ట్ర
ప్రయోజనాల కోసం పక్క పార్టీలతో కలిసి ఆలోచనల్ని పంచుకోవడం అనేది ఒక రాజకీయ
పార్టీ యొక్క నైతిక భాద్యత, కనీస అర్హత కూడా. చిన్నా చితకా పార్టీల
లీడర్లు సైతం ఈ నియమాన్ని పాటిస్తుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్
మాత్రం వీటినసలు లెక్కలోకి తీసుకోవడంలేదు.
ఎన్నికలు ముగిసిన తరవాత కొన్నాళ్ళు అసెంబ్లీలో హడావుడి చేసిన వైకాపా ఆ
తర్వాత దాన్ని కూడా బహిష్కరించి రోడ్ల మీదే కాలాన్ని వెళ్లదీసింది. దీంతో
సమావేశాల్లో టీడీపీని ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షం లేకుండాపోయింది.
ఒక్కసారి జగన్ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే బహిరంగసభల్లో తనను
ఆశీర్వదించమని అడగటం, చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం మినహా
సంస్కరణలను, సమస్యలకు పరిష్కారాలను సూచించిన సందర్భాలు బహు అరుదు. ఆయన
సొంత మీడియాలో సైతం పలానా సమస్యకు జగన్ పరిష్కారాన్ని చెప్పారనే వార్త
ఇన్నేళ్ళలో ఏనాడూ వచ్చింది లేదు.
ఇక పలుసార్లు మీడియా ముందుకొచ్చిన ఆయన బాబుని తిట్టడం తప్ప తనలోని
విప్లవాత్మకమైన ఆలోచనల్ని పంచుకున్న దాఖలాలు లేవు. ఇక తాజగా ఆల్ పార్టీ
సమావేశాన్ని కూడా ఎగ్గొట్టి ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి వేదిక
పంచుకోలేమంటూ సాకు చెప్పారు. హోదా మీద, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన,
ఇవ్వాల్సిన, ఇచ్చామంటున్న లెక్కల మీద ఈ డెబిట్ నిర్వహించారు ఉండవల్లి.
దీనికి దాదాపు అన్ని పార్టీల ముఖ్యలు హాజరై తమ అభిప్రాయాల్ని, వాదనల్ని,
పరిష్కార మార్గాల్ని వినిపించారు. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం
గైర్హాజరు. ఇలాంటి కీలక సమావేశాల్ని, తమ స్టాండ్ ఏమిటో బలంగా
వినిపించాల్సిన సందర్భాల్ని జగన్ బహిష్కరించుకుని కూర్చోవడం చూస్తే ఆయనకు
తన ఒప్పులు, టీడీపీ తప్పులు తప్ప రాష్ట్రంలోని కీలక అంశాల గురించిన లెక్కలు
తెలీవేమోననే అనుమానం కలుగుతోంది.
ఈ అనుమానం రూరల్ ఓటర్లపై ప్రభావం చూపకపోయినా అర్బన్ ఓటర్ల దృష్టిలో
పెద్ద బలహీనతగా గుర్తింపు పొందే ప్రమాదముంది. మరి ఎన్నికల నాటికైనా జగన్
రాష్ట్ర వ్యవహారాల మీద, స్థితి గతుల మీద తనకు పట్టుందని నిరూపించుకుంటారో
లేకపోతే అర్బన్ ఓటర్ల దృష్టిలో కేవలం ఒక పార్టీ నాయకుడిగానే మిగిలిపోతారో
చూడాలి.
Comments
Post a Comment